భారత్- చైనా మధ్య అమెరికానే చిచ్చుపెడుతోంది
భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే.. దానికి కారణం అమెరికానేనట. డోకాలామ్లో ఉద్రిక్తతల నడుమ భారత్కు మద్దతు ఇస్తూ అమెరికన్ మీడియా ప్రచురించిన ఆర్టికల్పై చైనా మండిపడింది. ఒకవేళ భారత్-చైనాల మధ్య యుద్ధం తలెత్తుతే దానికి కారణం అమెరికానే అని విరుచుకుపడింది. అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ ఎగ్జామినర్’ తన ఎడిటోరియల్ కాలమ్లో ‘ట్రంప్ మస్ట్ సపోర్ట్ ఇండియా అగనెస్ట్ చైనా’ అనే శీర్షిక పేరిట స్టోరీని ప్రచురించింది. దేశానికి వ్యతిరేకంగా మారుతున్న చైనాను అడ్డుకునేందుకు అమెరికా భారత్కు మద్దతునివ్వాలని పేర్కొంది.
ఈ కాలమ్ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్కు అంతగా రుచించకపోవడంతో సమస్య ఎక్కడుంటే అక్కడ తానున్నానంటూ అమెరికా తలదూరుస్తోందని ప్రతిఘటించింది. సమస్యలను పరిష్కరించేందుకు నిష్ఫక్షపాత ధోరణి ఉండాలని పేర్కొంది. కానీ, అమెరికా మాత్రం భారత్-చైనాల మధ్య పుల్లపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అమెరికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నానన్న ఉద్దేశం చైనా కాలమ్లో కనిపించింది. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా లేవనెత్తింది. దక్షిణ చైనా సముద్రంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మంచిది కాదని అమెరికాను హెచ్చరించింది.