నోరుపారేసుకుంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా చూపడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ మరో కొత్త వాదనకు తెరదించుతుంది. కాశ్మీర్ విషయంలో తమ వాదన ఇక చెల్లదని భావించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు భారత అంతర్గత, పరిపాలన వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేశారు. భారత్ విషయాల్లో కనీస అవగాహన లేకుండా మరోసారి నోరుపారేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన ఎన్ఆర్సీ, అణ్వస్త్ర విధానంపై ఇమ్రాన్ కొత్త వాదనకు తెరలేపారు. భారత్లోని అణ్వస్త్రాల భద్రతను శంకించిన ఆయన.. అంతర్జాతీయ సమాజం కలగజేసుకోవాలని అన్నారు. ఇటీవల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత అణ్వస్త్ర విధానంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తొలిసారి ప్రయోగించబోమన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన.. భవిష్యత్తు పరిణామాలు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. పాక్తో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న వేళ రాజ్నాథ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.