కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్ను టార్గెట్ చేసిన పతంజలి
పర్సనల్ కేర్, ఆయుర్వేద న్యూట్రిషన్లాంటి ప్రోడక్ట్స్లో ఇప్పటికే యూనిలీవర్లాంటి పెద్ద కంపెనీలను దెబ్బకొట్టిన పతంజలి.. తన తర్వాతి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. ఈసారి ఏకంగా అమెరికన్ జెయింట్స్ మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, సబ్వేలనే టార్గెట్ చేసింది. రెస్టారెంట్ చెయిన్ను ప్రారంభించాలని పతంజలి భావిస్తున్నట్లు సంస్థ బ్రాండ్ అంబాసిడర్, యోగా గురు బాబా రాందేవ్ వెల్లడించారు. ఫుడ్ విషయంలోనూ ఆయుర్వేద మార్క్ చూపించాలని కంపెనీ భావిస్తున్నది. దేశంలోని మొత్తం రీటెయిల్ బిజినెస్లో 57 శాతంతో ఫుడ్ బిజినెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2025 కల్లా దేశంలో ఫుడ్ బిజినెస్ విలువ రూ.71 లక్షల కోట్లకు చేరుతుందని ఇండియా ఫుడ్ ఫోరమ్ అంచనా వేస్తున్నది.
దీంతో పతంజలి కన్ను రెస్టారెంట్లపై పడింది. భారీ పెట్టుబడి అవసరమయ్యే వ్యాపారమే అయినా.. ఇప్పటికే తమకు మార్కెట్లో ఉన్న క్రేజ్తో సక్సెస్ కావాలని పతంజలి చూస్తున్నది. అనారోగ్యకరమైన ఆహారానికి భారతీయులను దూరంగా ఉంచడం అన్న కాన్సెప్ట్తో బాబా రాందేవ్ పతంజలి ఫుడ్ చెయిన్ను జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్లో 1.2 శాతం వాటా పతంజలి సొంతం. అదే రేంజ్లో రెస్టారెంట్ బిజినెస్లోనూ సక్సెస్ కావాలన్నది ఆ సంస్థ లక్ష్యం. 2016-17లో సంస్థ టర్నోవర్ రూ.10500 కోట్లకు చేరింది. అయితే తమకు రూ.30 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు తయారుచేసే సత్తా ఉందని రాందేవ్ చెప్పారు. ఇండియాను విదేశీ కంపెనీల బారి నుంచి రక్షించడమే తమ లక్ష్యమని బాబా రాందేవ్ స్పష్టంచేశారు.