ధోని నిర్ణయంపై కోహ్లి స్పందన
ముంబై: గత రెండు రోజుల క్రితం టీమిండియా క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని వైదొలిగిన నేపథ్యంలో అతని వారుసుడిగా మన్ననలు అందుకుంటున్న విరాట్ కోహ్లి తాజాగా స్పందించాడు. ఇప్పటికే ధోని నిర్ణయంపై పలువురు ప్రముఖులు తమ నిర్ణయాన్ని తెలపగా, కోహ్లి కాస్త ఆలస్యంగా వినూత్న శైలిలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నాయకత్వ లక్షణాల్లో ఘనమైన చరిత్ర కల్గిన ధోని మార్గదర్శకత్వమే యువ క్రికెటర్లమైన తమకు ఆదర్శమని కోహ్లి పేర్కొన్నాడు. ఎప్పటికీ ధోనినే తన కెప్టెన్ అంటూ కోహ్లి ట్వీట్ చేశాడు. ‘ నాయకుడు ఎప్పటికీ నాయకుడే. అటువంటి లక్షణాలు ధోని సొంతం. అతనే అందరికీ ఆదర్శం కూడా. అందులో నేను కూడా ఉన్నాను. నా కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినే’అని కోహ్లి పేర్కొన్నాడు.
దాంతో పాటు భారతదేశం అందరికీ సురక్షితమైన ప్రదేశం కావాలని కోహ్లి ఆకాంక్షించాడు. మన ఆలోచనల్ని మార్చుకున్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుందన్నాడు. ఇక్కడ మహిళల్ని వేరుగా చూడొద్దంటూ కోహ్లి ట్వీట్ చేశాడు. అందరం సమానం అనే భావన ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నాడు.