జీఎస్టీ కిందికి పెట్రోల్.. రాష్ర్టాలతో మాట్లాడతామన్న మోదీ
రోజురోజుకూ సామాన్యుడికి భారంగా మారుతున్న పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విషయమై రాష్ర్టాలతో మాట్లాడతామని ఆయన వెల్లడించారు. ఆయిల్, గ్యాస్ పరిశ్రమల అధిపతులతో సోమవారం సమావేశమైన సందర్భంగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందికి తీసుకురావాలని వాళ్లు ప్రధానిని కోరారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర పన్నులతో కలిపి పెట్రోల్, డీజిల్ రేట్లు తడిసి మోపెడవుతున్నాయి. అదే వీటిని జీఎస్టీ కిందికి తీసుకు వస్తే.. అందులోని గరిష్ఠ పన్ను పరిమితి 28 శాతం వేసినా ఇప్పుడున్న ధర కంటే దాదాపు సగం ధరకే పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వస్తాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించాలని ఇప్పటికే కోరారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆల్కహాల్ మాత్రమే జీఎస్టీ బయట ఉన్నాయి. అయితే ప్రధాని కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించడం కాస్త ఊరట కలిగించేదే.