బుమ్రా తాత ధీనస్థితి.. పట్టించుకోని స్టార్ క్రికెటర్!
మనవడు స్టార్ క్రికెటర్, అందునా టీమిండియాలో సభ్యుడు, ఐపీఎల్ లో క్రేజీ క్రికెటర్.. మరి ఆ తాత జీవితం ఎలా ఉండుండాలి? బీసీసీఐ మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ ఒప్పందంతో, ఇంకా రకరకాల ప్రమోషన్స్ తో, కాంట్రాక్ట్స్ తో కోట్లకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మనవడిని కలిగిన ఆ ముసలాయన లైఫ్ ఎంత బాగుండి ఉండాలి? చాలా మంది యువ క్రికెటర్ల కుటుంబీకులు దర్జాగా బతికేస్తున్న వైనాన్ని అంతా గమనిస్తూనే ఉన్నాం. అయితే అలాంటి అవకాశం మాత్రం దక్కలేదు టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా సొంత తాత సంతోఖ్ సింగ్ కు.
సంతోఖ్ సింగ్ తనయుడు జస్బీర్ సింగ్ కొడుకే బుమ్రా. ప్రస్తుతం 84 యేళ్ల ముదుసలి అయిన సంతోఖ్ ఈ వయసులో పడరాని కష్టాలు పడుతున్నారు. ఆటో నడుపుకోపవడమే ఆయన జీవనాధారం. చిన్న రూమ్ లో ఒక్కడే బతుకుతున్నారు సంతోఖ్. తన మనవడు ఆడే మ్యాచ్లను చూసి ఆనందిస్తున్న ఆయన ఆ మనవడి ఆదరణ అవసరమైన ధీనస్థితిలో ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని కిచ్చా పట్టణంలో నివసిస్తున్నారు సంతోఖ్ సింగ్. తను మరణించే లోపు మనవడిని ఒకసారి చూడాలని ఆయన ఆశపడుతున్నారు.
మరి మనవడితో సంతోఖ్ సింగ్ కు ఈ దూరం ఎందుకు వచ్చింది? ఎందుకు దూరంగా బతుకున్నారు అంటే.. అది పరిస్థితుల ప్రభావమే అనుకోవాలి. 2001లో బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించారు. అప్పుడు కోడలు, మనవడిని అంతగా ఆదరించినట్టుగా లేరు సంతోఖ్. వారు తమ బతుకు తాము బతకడానికి దూరంగా వెళ్లిపోయారు. అప్పట్లో కొన్ని ఆటోలను పెట్టుని వాటిని నడిపించుకునే వారట సంతోఖ్. అయితే ఆ వ్యాపారం దెబ్బతినడంతో సంతోఖ్ స్వయంగా ఆటోడ్రైవర్ గా మారారు. అంతలోనే ఆయన భార్య కూడా మరణించింది. ఒంటరైపోయారు.
ఇప్పుడు ఒక సింగిల్ రూమ్ లో నివసిస్తున్నారాయన. టీవీ మాత్రం పెట్టుకున్నారు. అది కూడా మనవడి ఆటను చూడటానికే. ప్రస్తుతం బుమ్రా సంపాదన కోట్ల రూపాయల్లో ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచే కోటి రూపాయలు అందుతుంది. ఇక ఐపీఎల్ ఒప్పందం ఉండనే ఉంది. ఇవిగాక మ్యాచ్ ఫీజులు అదనం. ప్రమోషనల్ కాంట్రాక్ట్స్ కూడా ఉండనే ఉంటాయి. ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే కోటీశ్వరుడయ్యాడు బుమ్రా. మరి గతంలో ఏం జరిగినా.. తాతను ఆదరించాల్సిన బాధ్యత అయితే అతడి మీద ఉంది. మీడియా ద్వారా సంతోఖ్ సింగ్ స్థితిని తెలుసుకుని అయినా బుమ్రా స్పందిస్తే బాగుంటుంది.