పదవి ముగిసే వేళ ప్రణబ్ను అవమానించారా?
పవర్.. పదవి… చేతిలో ఉన్నప్పుడు విలువ వేరు. ఎంత అత్యున్నత స్థానంలో ఉన్నా.. పదవి నుంచి దిగే టైం దగ్గర పడుతున్న కొద్దీ.. అప్పటివరకూ ఇచ్చిన గౌరవం.. మర్యాదల విషయంలో మార్పు వచ్చేయటం కామనే. కాకపోతే.. మరీ ఇంత ఇదిగానా? అన్న ప్రశ్న మోడీ మంత్రులను చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి పదవీకాలం పూర్తి అవుతున్న వేళ.. ఆయన్ను మోడీ మంత్రులు లైట్ తీసుకున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. మరి.. ఇలాంటి వేళ ఆయనకు ఇవ్వాల్సిన మర్యాద.. గౌరవం ఇచ్చేస్తే పోయేదేమీ లేదు. కానీ.. నెల రోజుల్లో పదవి నుంచి దిగిపోయే ప్రణబ్ తో పనేముందని అనుకున్నారేమో కానీ.. తాజాగా మోడీ బ్యాచ్ తేడాగా ప్రవర్తించింది. పదవీ కాలం ముగిసే వేళ.. ఇలాంటివి మామూలే అని పలువురు చెబుతున్నా.. ఇదేమాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమిటంటే..
ప్రతి ఏడాది మాదిరే ఈసారీ ఇఫ్తార్ విందును రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేశారు ప్రణబ్ ముఖర్జీ. ఎన్డీయే పవర్లో ఉన్న మూడేళ్ల కాలంలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరైన కేంద్రమంత్రులు తాజాగా మాత్రం హాజరు కాకపోవటం గమనార్హం.
రాష్ట్రపతి భవన్ నుంచి కేంద్రమంత్రులకు ఆహ్వానాలు వెళ్లినా.. ఒక్కరంటే ఒక్క కేంద్రమంత్రి కూడా రాష్ట్రపతి భవన్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరు కాకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మోడీ బ్యాచ్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న ఎంజే అక్బర్ రాష్ట్రపతి ప్రణబ్కు క్లోజ్. వీరిద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కూడా. అలాంటి అక్బర్ సైతం తాజా ఇఫ్తార్ విందుకు డుమ్మా కొట్టేశారు. పదవి నుంచి మరికొద్ది రోజుల్లో దిగిపోతున్న వేళ.. రాష్ట్రపతి పదవిలో ఉన్న ప్రణబ్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరి కాదంటున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కేంద్ర మైనార్టీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా అబ్సెంట్ కావటం గమనార్హం.