క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరిచిపోయే అవమానం కాదు… పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జాతీయ పార్టీల తీరుపై ట్విట్టర్లో మండిపడ్డారు. దక్షిణాది వారిని ఉత్తరాది వారు చిన్నచూపు చూడవద్దని పవన్ హెచ్చరించారు. బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్లో స్పందించారు.
దక్షిణాది వారు ఇచ్చే రెవెన్యూ.. నల్లగా ఉన్న దక్షిణాది వారు ఇచ్చే రెవెన్యూ కావాలి మీకు. కానీ వారంటే మీకు చిన్నచూపు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, వాళ్లకు చోటు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యం అని పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు.
మీది ఉత్తరాది అహంకారం ఉత్తరాది అహంకారం మీ (తరుణ్ విజయ్) మాటల్లోనే కనిపిస్తున్నది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరిచిపోయే అవమానం కాదు. ఇలాంటి మాటలు జాతిని గీత గీసి విడదీస్తాయి అంటూ ట్విట్టర్లో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే కోకిలను నిషేధించండి.. నల్లగా ఉన్నవి వద్దనుకుంటే కోకిలలను కూడా నిషేధించాలని పవన్ వ్యాఖ్యానించారు. ‘మీరు ఎగరేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడు పింగిళి వెంకయ్య రూపకల్పనే’ అని గుర్తు చేశారు. దీంతో పాటు దక్షిణాది నుంచి కేంద్రానికి అందే రెవెన్యూ వివరాలను.. ఆయా వివరాలతో కూడిన పలు వార్తా కథనాలను కూడా పవన్ ట్యాగ్ చేశారు.
తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లోని వారు నల్లగా ఉన్నా జాతి విద్వేషకులు కాదు. భారత్లో కూడా నల్లనివారు ఉన్నారు అని ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం వివాదాస్పదమైంది