బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ‘నవాబ్’ ఆకట్టుకుంటున్న ట్రైలర్
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘సెక్క సివంద వానం’. తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితి రావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పెద్ద తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ను కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా తమిళ వర్షన్ ట్రైలర్ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ వీక్షకుల్ని ఆకట్టుకుంది. అన్ని పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ట్రైలర్ ఆరంభమే ‘ఈరోజున క్రిమినల్స్కు చాలా పేర్లు ఉన్నాయి.. పారిశ్రామిక వేత్త, విద్యావేత్త, రియల్ఎస్టేట్ కింగ్ పిన్, ఇసుక మాఫియా, భూపతిరెడ్డి..’ అంటూ నటుడు ప్రకాశ్రాజ్ను పరిచయం చేశారు. ప్రకాష్ రాజ్ ని చూపిస్తూ భూపతి ఎవరు? అని ప్రశ్నించారు కాబట్టి ఆయనే భూపతి అనుకోవచ్చు. కానీ అక్కడే ఉంటుంది అసలు ట్విస్టు.. అదే మణిరత్నం శైలి. ఇందులోనే ఓ ఫ్యామిలీ ఫోటోని చూపించి సడెన్ ట్విస్టిచ్చారు. ఇందులో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు అన్నాదమ్ముళ్లుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘అప్పుడు యుద్ధమేగా.. మీ నిర్ణయం అదేనా..?’ అని జ్యోతిక అరవింద్ స్వామిని ప్రశ్నించడం కథపై ఆసక్తిని పెంచింది. ‘నీకెవరన్నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా?.. నమ్మొద్దు..’ అని అరవింద్ స్వామి తన స్నేహితుడు విజయ్ సేతుపతిని ఉద్దేశించి మరో వ్యక్తికి చెబుతున్నారు.నైజాం పోరి అదితీరావ్ హైదరీ జర్నలిస్టుగా ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు. మొత్తానికి ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాలో మ్యాటర్ ఎంతో చూడాల్సి ఉందింకా.