థియేటర్లలో ఉండగానే అమేజాన్లో రిలీజ్
నెల రోజుల కిందటే సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగు సినిమాల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజైన నెల రోజులకే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ఫ్లాట్ఫాంల్లో వచ్చేస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కు దూరమైపోతున్నారని.. కొన్ని రోజులాగాక ఆన్ లైన్లో చూసుకుందామని జనాలు థియేటర్లకు రావడం మానేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఫ్లాట్ఫాంల్లో సినిమాలు ప్రదర్శించడానికి కొంచెం వేచి చూసే ధోరణి ఉండాలని.. ఈ విషయంలో నిర్మాతలు ఆలోచించాలని కోరారు. ఐతే ఆయన సూచనను ఇతర నిర్మాతలు పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా లేదు.
ముఖ్యంగా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతే సురేష్ బాబు సూచనను పట్టించుకోవడం లేదు. ఆయన సమర్పణలో వచ్చిన ‘జవాన్’ సినిమా విడుదలైన నాలుగు వారాల్లోపే అమేజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. ఐతే ఆ సినిమా పెద్దగా ఆడలేదు కాబట్టి.. రెండు వారాలకే థియేటర్ల నుంచి లేచిపోయింది కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రాజు నిర్మాణంలో వచ్చిన ‘ఎంసీఏ’ నెల తిరక్కుండానే అమేజాన్లో రిలీజైపోయింది. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ఉండటం.. మొన్న సంక్రాంతి సీజన్లో దీనికి మంచి వసూళ్లు కూడా రావడం గమనార్హం. అయినా డిజిటల్ ఫ్లాట్ఫాంలో రిలీజ్ చేయడానికి దిల్ రాజు వెనుకంజ వేయలేదు. ఆయన లాంటి పెద్ద నిర్మాతే సురేష్ బాబు మాటను పట్టించుకోనపుడు ఇక మిగతా వాళ్లు ఏం వింటారు?