అమెరికా హత్యకేసుః నేను చంపలేదంటున్న భర్త
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన అమెరికా న్యూజెర్సీలో నివసిస్తున్న భారతీయ మహిళ శశికళ ఆమె కుమారుడి దారుణ హత్యలో మరో ట్విస్ట్. ఈ హత్య వార్త వెలుగులోకి వచ్చిన సమయంలో జాతి విద్వేష కోణంలో జరిగి ఉంటుందని పలువురు భావించారు. అయితే ఈ ఘటన వెనుక మరో కోణాన్ని మృతురాలి తల్లిదండ్రులు బయటపెట్టారు. తమ అల్లుడు నర్రా హనుమంతరావుకు అమెరికాలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని అందువల్ల అతడే తమ కూతురిని మనవడిని చంపాడని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై శశికళ భర్త నర్రా హనుమంతరావు స్పందించారు. శశికళ తల్లిదండ్రులు బాధలోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన భార్య శశికళ కుమారుడు హనీశ్ సాయిని తాను హత్య చేయలేదని నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలుతాయని హనుమంతరావు చెప్పారు. కాగా ఆయన మరో చిత్రమైన వాదన వినిపించారు. భార్య-కుమారుడి మృతదేహాలు స్వగ్రామానికి వస్తాయని చెప్పిన నర్రా హనుమంత రావు తాను వచ్చేది లేనిది ఇంకా నిర్ణయిం తీసుకోలేదని చెప్పడం గమనార్హం.
కాగా 2004 డిసెంబరు 30న నర్రా హనుమంతరావుకు శశికళకు వివాహం జరిగింది. 2006లో నర్రా హనుమంతరావు న్యూజెర్సీ వెళ్ళాడు. సీటీఎస్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్నశశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. శశికళ బుధవారం సాయంత్రం బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారని చెప్పారు. వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానన్నారు. అయితే… తమ అల్లుడు చెబుతున్నదంతా కట్టుకథేనని అతడికి అక్కడ ఒక మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే తమ కూతురిని హతమార్చాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.