పవనెందుకు.. అల్లు అర్జున్, రామ్చరణ్ ఉండగా…అల్లు అరవింద్
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై పవన్ కల్యాన్ స్పందించారు. రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీని విలీనం చేయడం చిరంజీవిగారి తప్పే అనుకోండి. కానీ ఏమండి మీరు తప్పుచేస్తున్నారు. అది తప్పు. నిజంగా మీకు సమాజం మీద ప్రేమ ఉంటే తప్పు చేయనిస్తారా? కాంగ్రెస్ పార్టీలో కలపనిస్తారా? మీకు అలాంటి భావనే లేదు కదా!. అన్నయ్యగారు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంటే ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నాను అంటే.. నేనేప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. సర్వెంట్ లీడర్ షిఫ్ అంటాం. ఒక ఆలోచనా విధానం పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకువెళుతున్నప్పుడు.. ఒక కెప్టెన్ షిప్ని నడుపుతున్నప్పుడు.. ఆ నాయకుడిగా అన్నీ తెలుసు. అందుకే ఆ నాయకుడిని నేను అనుసరిస్తా. నాకు చాలా ఇబ్బందులనిపించినాయ్. నాకేం తెలియక కాదు. కాకపోతే నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది. ఆరోజు నేను చెబితే వినేలా లేదు.
ఉదాహరణకి అల్లు అరవింద్ గారు అన్నారు. పవన్ కల్యాణ్ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించండి అంటే.. ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అన్నారు. అప్పుడు నాకనిపించింది.. నేను రాజకీయాలలోకి తెలుసుకుని వచ్చాను. అప్పుడు నాకు అర్ధమైంది ఏమిటంటే అల్లు అరవింద్గారు నన్ను నటుడిగానే చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనల్లుడితో పాటు పవన్ కల్యాణ్ అనే వాడు ఒక నటుడంతే. అంతేగానీ, వారికి నాలో ఉన్న సామాజిక స్పృహ మాత్రం కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడ్ని. కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.