అనాగరికంగా ప్రవర్తించాడు: పీవీ సింధుకి వేధింపులు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో ఎయిర్లైన్ స్టాఫ్ ఆమెతో అనాగరికంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని పీవీ సింధు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. పీవీ సింధు చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి. ”చెప్పడానికి చాలా బాధకరంగా ఉంది. నవంబర్ 4న 6ఈ 608 విమానంలో ముంబైకి బయలుదేరడానికి వెళ్లిన నాకు, గ్రౌండ్ స్టాఫ్ అజితేష్ నుంచి చాలా చేదు అనుభవం ఎదురైంది” అని మొదటి ట్వీట్లో చెప్పారు.
మరో పోస్టులో ” అజితేష్ చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ఎయిర్హోస్టస్ అషిమా ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలని పలు మార్లు సూచించింది. అయినప్పటికీ ఆమెతో కూడా ఆయన అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. దాన్ని చూసి నేను చాలా షాక్ అయ్యా. ఇలాంటి వ్యక్తులను ఇక్కడ పనికి పెట్టుకుంటే, ఇండిగో ఎయిర్లైన్స్ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి” అని తెలిపారు. అషిమాతో మాట్లాడితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఎయిర్లైన్స్ నుంచి ఓ దేశీయ క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురువడం ఇదే తొలిసారి కాదు. అంతకముందు కూడా సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్లు కూడా బ్రిటీష్ ఎయిర్వేస్, జెట్ ఎయిర్వేస్లపై మండిపడ్డారు.