మహానాడు మధ్యలో రేవంత్ వెళ్లిపోయారే?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు రేవంత్ రెడ్డి.  తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా పలువురు ఆయన్ను అభివర్ణిస్తుంటారు. విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవటం.. ఆయన మాట్లాడుతున్నప్పుడు  పెద్ద ఎత్తున కేకలు.. హర్షాతిరేకాలు వ్యక్తం కావటం కనిపించింది.

పార్టీలో నేతలు చాలామందే ఉన్నా.. రేవంత్ రెడ్డిది మాత్రం ప్రత్యేకమైన ఇమేజ్ అన్నట్లుగా కనిపించింది. మహానాడులో ఆయన కాస్త ప్రత్యేకంగా ఫోకస్ కావటం కనిపించింది. ఇదిలా ఉంటే.. ఆదివారం జరిగిన మహానాడు రెండో రోజున.. రేవంత్ రెడ్డి మధ్యలో వెళ్లిపోవటం కనిపించింది. మహానాడులో ఆయన ఎక్కువ సేపు లేకపోవటంపై పలువురు చర్చించుకున్నారు.

అయితే.. రేవంత్ రెడ్డి మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయారన్న విషయంపై దృష్టి పెట్టగా.. ఆయన స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారన్న విషయం బయటకు వచ్చింది. విశ్రాంతి లేకపోవటం.. స్వల్పంగా వచ్చిన జ్వరంతో ఆయన  నీరసపడిపోవటంతో ఆయన తాను బస చేసిన హోటల్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

స్వల్ప అనారోగ్యంతోనే రేవంత్ మహానాడు మధ్యలో హోటల్ కి వెళ్లిపోయారే తప్పించి.. మరే ఇతర కారణం లేదని చెబుతున్నారు. సోమవారం ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తమకు 111 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య చేయటం.. టీడీపీ ఒక్కచోట కూడా గెలవదని స్పష్టం చేసిన వేళ.. దానికి కౌంటర్ గా రేవంత్ ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *