స్టీవ్ స్మిత్ సరికొత్త ఘనత
రాంచీ: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరికొత్త ఘనతను సొంతం చేసుకున్నాడు. గురువారం తొలి రోజు ఆటలో సెంచరీతో జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దిన స్మిత్.. శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ గా నిలిచాడు. ఈ రోజు ఆటలో 130 పరుగుల వ్యక్తిగత స్కోరును దాటిన అనంతరం ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పాత రికార్డును స్మిత్ చెరిపేశాడు. 2012-13 సీజన్ లో భారత్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆసీస్ కెప్టెన్ క్లార్క్. ప్రస్తుతం ఆ రికార్డును స్మిత్ అధిగమించాడు.
మరోవైపు భారత్ లో ఒక సిరీస్ లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన మూడో కెప్టెన్ గా స్మిత్ గుర్తింపు సాధించాడు. ఈ సిరీస్ లో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్మిత్ శతకం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో క్లైవ్ లాయిండ్(1974-75), అలెస్టర్ కుక్(2012-13)లు ఉన్నారు.