సుఖసంతోషాల కోసం..వరలక్ష్మీ వ్రతం
నేడు వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆలయాల్లో సామూహిక కుంకుమ పూజలు, వ్రతాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. వరలక్ష్మీ వ్రతానికి అంత ప్రాముఖ్యత ఎందుకో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
సౌభాగ్యం కలకాలం వర్థిల్లాలనే కోరికతో మహిళలు నిర్వహించే వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో అమ్మ వారికి శ్రావణపూజలు చేస్తే తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని మహిళల నమ్మకం. దోష శుద్ధికోసం శుద్ధలక్ష్మిని, మోక్షం కోసం మోక్షలక్ష్మిని, జయం కోసం జయలక్ష్మిని, విద్యాప్రాప్తి కోసం సరస్వతీదేవిని, సిరిసంపద, సుఖసంతోషాలకోసం వరలక్ష్మీని పూజిస్తారు.
పూర్వం మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. చారుమతి అనే ఉత్తమ ఇల్లాలు నివసిస్తుండేది. భర్త, అత్తమామలను భక్తితో చూసేది. ఆమె కుటుంబం పేదరికంతో బాధపడు తుండేది. మంచి మార్గంలో నడుచుకునే స్త్రీలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాంటి వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటుంది. చారుమతి మంచితనాన్ని గమనించిన వరలక్ష్మీదేవి అనుగ్రహించాలనుకుంది. ఓ రోజు రాత్రి కలలో కన్పించి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేయమని చెప్పిందట. కలలో అమ్మవారు చెప్పిన విధంగా వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని చుట్టుపక్కల ముత్తైదువలను పిలిచి వరలక్ష్మీ వ్రతాన్ని జరిపిం చిందట. వ్రతం ముగిసిన తర్వాత అమ్మవారికి ప్రదక్షిణలు చేయగా ఒక్కొక్క ప్రదక్షణ చేస్తున్న ప్పుడు ఆ స్త్రీల శరీరాలకు ఒక్కో బంగారం ఆభరణం వచ్చి చేరిందట. ఈ విధంగా వ్రతం ప్రాచుర్యం పొందింది.
శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారు మన ఇంట కాలు పెట్టాలని వాకిళ్లను ఏ విధంగా అయితే బార్లా తెరుచుకుని ఉంటామో, మనసులోకి సానుకూల భావనలు రావాలని, ధనాత్మకమైన ఆలోచనలు కలగాలని మనసును కూడా అదేవిధంగా తెరిచి ఉంచుకోవాలి.