మోదీకి రాఖీ కట్టిన 103 ఏళ్ల బామ్మ
నూటమూడు ఏళ్లు ఉన్న ఓ బామ్మ ఇవాళ ప్రధాని మోదీకి రాఖీ కట్టింది. ఆమె పేరు షర్బతీ దేవి. ఈ వితంతువు 50 ఏళ్ల క్రితమే తన సోదరున్ని కోల్పోయింది. అయితే ఈ ఏడాది ప్రధాని మోదీకి ఆమె రాఖీ కట్టాలనుకున్నది. ఆ విషయాన్నిబామ్మ కుమారుడు ప్రధానికి లేఖ ద్వారా తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ఆ బామ్మకు ఇవాళ అపూర్వ స్వాగతం పలికారు. షర్బతీ దేవితో పాటు ఆమె కుటుంబం ప్రధాని కార్యాలయానికి వచ్చింది. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతీ దేవి అత్యంత ఆనందానికి లోనైంది. రక్షా బంధన్ అంటే అన్నాచెల్లెల్ల అనుబంధం అంటూ నిరూపించారు. బామ్మతో కాసేపు ముచ్చటించిన ప్రధాని మోదీ ఆమె దీవెనలు కూడా అందుకున్నారు.