భర్త డబ్బులు అడిగాడని చెప్పి…భార్యను మోసం..
భార్యాభర్తల మధ్య మాటలు లేవునే విషయాన్ని తనకు అనువుగా మార్చుకుని డబ్బు కాజేశాడో ఆగంతకుడు. హన్మకొండ గోకుల్నగర్లో నివాసం ఉంటున్న శారదకు తన భర్తతో కొన్నేళ్లుగా మాటలు లేవు. ఆమె భర్త ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. దీనితో ఓ ఆగంతకుడు ఫోన్ చేసి ‘నీ భర్తకు డబ్బు అవసరం ఉందట.. ఆయన నీతో మాట్లాడడం లేదు కాబట్టి నాతో ఫోన్ చేయించాడు’ అని చెప్పేవాడు. దీంతో ఆయన మాటలు నమ్మిన శారద పలు సార్లు ఆన్లైన్ ద్వారా రూ.3,20,800 పంపించింది. చివరకు అనుమానం వచ్చిన ఆమె నేరుగా తన భర్తకు ఫోన్ చేసి ఆరా తీయడంతో మోసం బయటపడింది. ఈ మేరకు సుబేదారి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.