దిగ్గజాల సరసన రహానే
ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో చెలరేగిపోతూ టెస్టు బ్యాట్స్మన్ ముద్రను చెరిపేసుకున్న భారత ఓపెనర్ అజింక్యా రహానే తాజాగా మరొక ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ద్వైపాక్షిక సిరీస్లో యాభైకి పైగా స్కోర్లను నాలుగుసార్లు నమోదు చేసిన మూడో భారత ఓపెనర్గా రహానే గుర్తింపు పొందాడు. వెస్టిండీస్ తో నాల్గో వన్డేలో రహానే 60 పరుగులు చేయడం ద్వారా ఆ ఘనతను సాధించాడు. తద్వారా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ల సరసన రహానే నిలిచాడు. అంతకుముందు ఒక దైపాక్షిక సిరీస్ లో నాలుగుసార్లు యాభైకి పరుగులు సాధించిన భారత ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్లు మాత్రమే.
మరొకవైపు వరుసగా నాలుగోసారి యాభైకి పైగా పరుగుల్ని సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో సైతం రహానే స్థానం సంపాదించాడు. ఈ సిరీస్ లో తొలి వన్డేలో 62 పరుగులు చేసిన రహానే.. రెండో వన్డేలో 103 పరుగులు సాధించాడు. ఇక మూడో వన్డేలో 72 పరుగులు నమోదు చేయగా, నాల్గో వన్డేల్లో 60 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇలా వరుసగా నాలుగుసార్లు యాభైకి పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్, అజహరుద్దీన్, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనాలు ఉన్నారు. ఇందులో సచిన్(1996, 2003), అజహరుద్దీన్(1990-93) లు రెండేసార్లు ఈ ఘనతను సాధించగా, గంగూలీ(2002), కోహ్లి(2010), ధోని(2011), రైనా(2013) తలో ఒక్కసారి వరుసగా నాలుగుసార్లు యాభైకి పరుగుల్ని సాధించిన జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంచితే, వన్డే ఫార్మాట్ లో రాహుల్ ద్రవిడ్, టెండూల్కర్, కోహ్లిలు వరుసగా ఐదుసార్లు హాఫ్ సెంచరీలు సాధించి భారత్ తరపున సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.