సాగర్ నీళ్లకై రెండు తెలుగు రాష్ట్రాల హైటెన్షన్

రాష్ట్ర విభజన జరిగితే.. రెండు రాష్ట్రాల మధ్య వచ్చే నీళ్ల పంచాయితీల తీవ్రత చాలానే ఉంటుందన్న అభిప్రాయాన్ని అప్పట్లో పలువురు వ్యక్తం చేశారు. అయితే.. విడిపోయి కలిసి ఉందామన్న నినాదం మేరకు.. అలాంటివేమీ ఉండవన్న మాటను పలువురు చెప్పారు. కానీ.. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలకు ఏ మాత్రం కొదవ లేని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

రెండేళ్ల క్రితం సాగర్ నీటిపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్యవివాదం అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఓదశలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య తోపులాటల వరకూ విషయం వెళ్లింది. ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు చొరవతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అనంతరం పరిణామాలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి.

రెండేళ్ల క్రితం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. తాజాగా మళ్లీ అదే తీరులో పరిణామాలు చోటు చేసుకున్నాయి. నీళ్లు వదలాలంటూ ఏపీ అధికారులు కోరటం.. అందుకు తెలంగాణ అధికారులు ససేమిరా అనటం కనిపిస్తుంది. తాజాగా కూడా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం శ్రుతిమించి ముఖాముఖి తలపడే వరకూ వెళ్లిందన్న మాట వినిపిస్తోంది. మంగళవారం ఉదయం మొదలైన పంచాయితీ రాత్రి వరకూ కొనసాగి.. చివరకు అర్థరాత్రి వేళ కుడికాలువకు నీటిని విడుదల చేసేందుకు అంగీకరించటంతో పరిస్థితి నార్మల్ కు వచ్చినట్లుగా చెబుతున్నారు.

మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల్లోకి వెళ్లే ముందు ఏపీ.. తెలంగాణ వాదనల్ని చూస్తే..

ఏపీ వాదన ఇది..

కుడికాలువకు 15 టీఎంసీలు నీటిని ఇవ్వాలి. మంగళవారం నాటికి13.89టీఎంసీలు నీటిని ఇచ్చారు. ఇంకా 1.05 టీఎంసీలు రావాలి. కానీ.. ఇవ్వట్లేదు

తెలంగాణ వాదన ఇది..

ఫిబ్రవరికి ముందు శ్రీశైలం నుంచి సాగర్ కు నీటిని విడుదల చేశాం. ఆ సమయంలోనే నష్టపోయిన నీటిని కూడా లెక్కకట్టి ఆంధ్రాకు విడుదల చేశాం. లెక్క సరిపోయింది. కానీ.. ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలనటం సరికాదు.

మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే..

= మంగళవారం ఉదయం ఏపీ ఈఈ జబ్బార్ కంట్రోల్ రూమ్ కి బయలుదేరారు. ఆయన వెంట సిబ్బంది.. మీడియా ప్రతినిధులు ఉన్నారు.

= డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ పోలీసులు.. ఏపీ ఈఈ కారును ప్రధాన గేటు వద్ద ఆపేశారు.

= సిబ్బందిని. . మీడియాను వదిలేసి వస్తే మాత్రమే లోపలికి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. తమకు ఆదేశాలు అలానే ఉన్నాయని చెప్పారు.

= సిబ్బందిని.. మీడియాను వదిలేసిన ఈఈ డ్రైవర్ డ్యామ్ పైకి వెళ్లారు.

= ఏపీ ఈఈ డ్యామ్ వద్దకు వచ్చారన్న విషయం తెలుసుకొని తెలంగాణ ఈఈ.. డీఈ కంట్రోల్ రూంకి చేరుకున్నారు.

= ఇరువురు నీటి విడుదలకు లెక్క చూసుకున్నారు.

= లెక్క సరిపోయిందని తెలంగాణ అధికారులు.. కాదు.. ఒక టీఎంసీ కంటే ఎక్కువ నీటిని విడుదల చేయాల్సి ఉందని ఏపీ అధికారుల మధ్య రచ్చ మొదలైంది

= ఇరువర్గాల మధ్య వాదనలు అంతకంతకూ పెరిగాయి.

= వాదనల తీవ్రత పెరిగి.. ఒకరిపై మరొకరు వెళ్లే వరకూ పరిస్థితులు చోటు చేసుకన్నాయి. ఇరు వర్గాల్నిశాంతింపచేశారు.

= ఇరు వర్గాలు జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

= చివరకు మంగళవారం అర్థరాత్రి వేళ కుడికాలువకు నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు.

= నీటి విడుదల కార్యక్రమాన్ని అప్పటికప్పుడు ప్రారంభించటంతో.. ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *