కళ్యాణలక్ష్మి పథకానికి అప్లై చేసుకోండిలా..
2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దళితుల (షెడ్యూల్డ్ క్యాస్ట్-ఎస్సి), గిరిజనుల (షెడ్యూల్డ్ ట్రైబ్స్-ఎస్టి)కు కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ముస్లిం మైనారిటీలకు, బీసీ, ఈబీసీలకు విస్తరిస్తున్నట్లు సీఎ కేసీఆర్ ప్రకటించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలలో 18 సంవత్సరాలు వయస్సు వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు నిర్ణయిస్తే అమ్మాయి పేరుతో 75 వేల ఒక వంద పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ముస్లిం మైనారిటీ అమ్మాయిలకు కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేస్తే 75 వేల ఒక వంద పదహారు రూపాయలు ఆర్థిక సాయం అందజేేస్తున్నారు. పథకం ప్రారంభంలో ఈ ఆర్థిక సహాయం 51 వేలుగా ఉండేది. 2017-18 బడ్జెట్లో 75 వేల ఒక వంద పదహారుకు పెంచడం జరిగింది.
పథకం అమలు నిబంధనలు
కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసేందుకు కూడా నియమ, నిబంధనలను విధించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఈబీసీకు చెందిన వారిలో పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే వారికిఏటా రెండు లక్షల రూపాయలకు మించకుండా ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉన్న వారికి 175000 ఆదాయం ఉన్న కుటుంబాలకే ఈ పథకం వర్తిస్తుంది. పెళ్లి జరిగేందుకు కనీసం నెల రోజుల ముందు అమ్మాయి, అబ్బాయికి సంబం ధించిన వివరాలను ప్రభుత్వానికి ఆన్లైన్లో పంపించాలి. https://telanganaepass.cgg.gov.in/KalyanLakshmi.do వెబ్సైట్ను ఓపెన్ చేసి వివరాలు పూర్తి చేయాలి. ఎస్సీలు అయితే కమిషనర్ ఎస్సీకి, ఎస్టీలు అయితే కమిషనర్ ఎస్టీ శాఖకు, ముస్లిం మైనారిటీలు అయితే కమిషనర్/డైరెక్టర్ మైనారిటీ సంక్షేమ శాఖకు దరఖాస్తు వెళుతుంది.
పెళ్లి కూతురు, పెళ్లికొడుకు పేర్లు, ఇద్దరి ఫోటోలు (పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు) వారి తల్లిదండ్రుల పేర్లు, ఊరు/వాడ- పట్టణం, ఇంటి నెంబర్, కులం, ఉపకులం, వార్షికాదాయం, చదువు, వయస్సుకు సంబంధించి సర్టిఫికెట్టు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికెట్టు, పెళ్లి కూతులు తల్లికి సంబంధించిన బ్యాంకు శాఖ, అకౌంట్ నెంబర్ తదితర వివరాలన్నింటినీ ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఏ కులం వారైతే వారికి సంబంధించిన సంక్షేమ శాఖ పోర్టల్లో వెబ్ అడ్రసు, ఆన్లైన్లో దరఖాస్తు ఫారం ఉంటాయి. వీటిని భర్తీ చేసి, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
2014 అక్టోబర్ 2 తర్వాత పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తులు అందగానే సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోగా నిధులను మంజూరు చేస్తున్నారు. అయితే లబ్ధిదారులు పూర్తి వివరాలను ఆన్లైన్లో అందించాల్సి ఉంటుంది. సరైన వివరాలను అందిస్తే వెరిఫికేషన్ సులువుగా చేసేందుకు వీలవుతుంది. మూడు శాఖలు కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, పనులు తొందరగా అయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. పేదలైన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, బీసీ, ఈబీసీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు