హీరోయిన్ రష్మికా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న నివాసంలో కర్ణాటకలోని కూర్గ్లోని ఐటీ అధికారులు సోదాలు సంక్రాంతి పండగవేళ నిర్వహిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత ఏడాది కాలంగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతోన్న రష్మికా.. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించింది. బోలెడు హిట్లు, చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆదాయ లెక్కలను ఐటీ అధికారులు పరిశీస్తున్నారు. ఇంటిపై 10 మంది ఐటీ అధికారుల బృందం గురువారం సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం 7.30 గంటలకు సోదాలు ప్రారంభించారు. ఆ సమయంలో రష్మిక ఇంట్లో లేరు. ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ప్రస్తుతం రష్మిక హైదరాబాద్లో ఉన్నట్టు ఆమె మేనేజర్ కిరణ్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఐటీ సోదాలు రష్మిక ఆర్థిక లెక్కలపై కాదని ఆయన చెప్పారు. రష్మిక తండ్రి మదన్ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని వెల్లడించారు. రష్మిక ఆర్థిక వ్యవహారాలన్నీ హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘అర్ధరాత్రి వరకు రష్మిక షూటింగ్లో పాల్గొన్నారు. ఐటీ సోదాలు జరిగిన విషయం ఆమెకు తెలీదు’’ అని కిరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ‘భీష్మ’ సినిమాలో నితిన్ సరసన నటిస్తున్నారు. అలాగే, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించబోతున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులు ఈ రెండే. ఇక కన్నడలో ‘పొగరు’, తమిళంలో ‘సుల్తాన్’ సినిమాల్లో నటిస్తున్నారు. కన్నడలో కిరాక్ పార్టీతో కెరీర్ ప్రారంభించిన రష్మిక, తెలుగులో ఛలో సినిమాతో హిట్ ట్రాక్ మొదలెట్టింది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం రష్మికా కెరియర్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. తెలుగులో కెరియర్ తారాస్థాయిలో ఉండడంతో ఎంగేజ్మెంట్ను కూడా క్యాన్సల్ చేసుకుని టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది రష్మికా. డియర్ కామ్రెడ్, దేవదాసు కూడా ఓ స్థాయిలో నడవగా.. తాజాగా మహేష్బాబుతో సరిలేరు నీకెవ్వరు చేసింది రష్మికా. స్టార్ హీరోలతో చేతిలో మరిన్ని సినిమాలున్న రష్మికా బోలెడు ఆదాయం సంపాదిస్తుందన్నది ఐటీ వర్గాల అంచనా.