రేవంత్ ను తన బండెక్కమన్న జగన్

వైసీపీని – జగన్ ను… ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబాన్ని విమర్శించడంలో ముందుండే తెలంగాణ నేత ఎవరండీ అంటే ఠక్కున వినిపించే పేరు రేవంత్ రెడ్డి.  ఛాన్సు దొరికితే చాలు తనను విమర్శించే రేవంత్ ను వైసీపీ అధినేత జగన్ మాత్రం సాదరంగా ఆహ్వానించారట. ఆయన వెళ్లబోయే చోటికి తన బండిలో వెళ్లాలంటూ ప్రతిపాదించారట.

రీసెంటుగా రేవంత్ – జగన్ అనుకోని పరిస్థితుల్లో ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. జగన్ – రేవంత్ ఇద్దరూ ఎయిర్ పోర్టులో కలిశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకి విమానంలో జగన్ వెళ్లారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో జగన్ కు కనిపించారు. అలా రేవంత్ రెడ్డి కనిపించగానే జగన్ చొరవ తీసుకున్నారు. “రేవంత్ అన్నా!” అంటూ  పలుకరించారు. ఎలా ఉన్నారు కుటుంబసభ్యులు ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేశారు. అలా ఇద్దరు కొన్ని నిమిషాల పాటు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.

అంతవరకు బాగానే ఉంది… అంతలోనే జగన్ కు చిన్న డౌట్ వచ్చింది.  నిత్యం హడావుడిగా కనిపించే రేవంత్ రెడ్డి తనతో ఎలాంటి హడావుడి లేకుండా ఆరామ్ గా మాట్లాడుతుండేసరికి జగన్ కు సందేహం వచ్చిందట.  ఆయన వెహికల్ ఏమైనా ఇంకా రావాల్సి ఉందేమో.. వెయిట్ చేస్తున్నారేమో అనిపించిందట. దాంతో వెంటనే…  ‘‘రేవంత్ అన్నా వెహికల్ ఏమైనా లేట్ అవుతుందా? లేదంటే మన వాళ్లు ఏర్పాటు చేస్తారు.. మన బండిలో వెళ్లండి” అంటూ ప్రతిపాదించారు.  అయితే.. రేవంత్ అందుకు బదులిస్తూ..  తమ వాళ్లు బయట ఉన్నారంటూ చెప్పారు. ఆ తరువాత ఇద్దరు మరోసారి నమస్కారాలు పెట్టుకుని ఎవరి దారిని వారు వెళ్లిపోయారు.  రాజకీయమంటే తిట్టుకోవడం చొక్కాలు పట్టుకోవడం అన్నట్లుగా ఉన్న కాలంలో ఇలా విమర్శలు చేసుకునే నేతలూ ఎదురెదురు పడినప్పుడు సుహృద్భావంతో మాట్లాడుకోవడం మంచిదే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *