జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా?

తమిళనాడు రాజకీయాలు బాగా వేడెక్కాయి. గవర్నర్ ఎటూ నిర్ణయం తీసుకోకపోవడంతో.. ఇరువర్గాలూ మండిపడుతున్నాయి. ఇటు శశికళ, అటు పన్నీర్ సెల్వం ఇద్దరూ కూడా అమ్మ జయలలితకు అసలైన వారసులం తామే అంటున్నారు. అయితే, అసలు జయలలిత తన చివరి క్షణాల్లో ఏం చెప్పారు? తన రాజకీయ వారసులుగా ఎవరినైనా ప్రకటించారా అనే విషయాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. జయలలిత తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో సుదీర్ఘ కాలం పాటు చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె పక్కన ఒక్క శశికళ తప్ప వేరెవ్వరూ లేరు. వైద్యులు, నర్సులు కాక అమ్మ పక్కన ఉన్న ఏకైక వ్యక్తి, ఆమెతో మాట్లాడిన ఒకే ఒక్క నాయకురాలు శశికళ మాత్రమే. అందువల్ల జయలలిత ఏం చెప్పారన్న విషయం కూడా ఆమెకే తెలియాలి. అమ్మ చివరి క్షణాల్లో ఏం చెప్పారో అనే విషయాన్ని చిన్నమ్మ తాజాగా వెల్లడించారు. ”మన పార్టీని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు” అన్నదే అమ్మ చివరి మాట అని, ఆ మాటలను ఆమె తనతో చెప్పారని శశికళ అన్నారు.

అందుకే పార్టీని కాపాడేందుకు కావాలంటే తాను ప్రాణత్యాగం కూడా చేస్తానని తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి చెన్నైలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోనే ఆమె ఈ విషయం కూడా చెప్పారు. పార్టీనే మనకు ఆస్తిగా అమ్మ ఇచ్చారని, దాన్ని తీసుకుని తీరాలని ఎమ్మెల్యేలతో ఆమె చెప్పారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో ఎవరూ పెద్దగా చదువుకోకపోయినా.. ఒకరోజు వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యేలా జయలలితే వారికి శిక్షణ ఇచ్చారని, ఆమె చేసిన సేవలు మర్చిపోవద్దని వారితో అన్నారు.

అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఏడుపు వస్తుందని, ఆమెతో పాటు ఎమ్మెల్యేలు కూడా తన మీద చాలా బాధ్యత పెట్టారని, దాన్ని నెరవేర్చి తీరుతానని శపథం చేశారు. ప్రస్తుతం మనం కష్టాలు ఎదుర్కొంటున్నామని, అయినా ఎవరూ తనను ఏమీ చేయలేరని అన్నారు. తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, వెనక్కి తగ్గేది లేదని, ప్రతిపక్షాలు మాత్రం తను మహిళను కాబట్టి తొక్కేయాలని తక్కువ అంచనా వేస్తున్నాయని మండిపడ్డారు. అమ్మను వాళ్లు ఏమీ చేయలేకపోయారని, అలాగే తనను కూడా ఏమీ చేయలేరని గర్జించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *