కేసీఆర్ రిటైర్మెంట్ ఖాయమే(నా)!?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? అందుకే తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితను జనంలో బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారా? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన సభే.. అందుకు పునాది రాయి వేసిందా? ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే అభిప్రాయం వినిపిస్తోంది. కొంత కాలంగా ప్లాన్ ప్రకారం కేటీఆర్ ను లిఫ్ట్ చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఓపెన్ గా తన నిర్ణయాన్ని ఆర్మూర్ సభతో చెప్పేశారన్న అభిప్రాయం జనం నుంచి కూడా వ్యక్తమవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటి నుంచి గమనిస్తే.. కేటీఆర్ ను ఫోకస్ చేసేందుకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ కేసీఆర్ వాడుకున్నారు. ఆయన ఇచ్చిన సూచనలకు తోడు.. సొంతంగా ఉన్న తెలివితేటలతో కేటీఆర్ కూడా వాటిని అందిపుచ్చుకుని విజయం సాధించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఇప్పుడు.. త్వరలో.. అంటే.. మరో రెండేళ్లలో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలో.. తన వారసుడిగా కేటీఆర్ ను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపే సమయం వచ్చిందనే కేసీఆర్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
కేటీఆర్ కు ఎవరి నుంచి ఇబ్బంది రాకుండా ఉండేందుకే.. కుమార్తె కవితను కూడా తన ప్రయత్నాల్లో భాగం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే.. అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఇద్దరినీ.. ఒకేసారి వేదికపైకి తీసుకొచ్చి ఉంటారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. హరీష్ రావుకు మరింత చెక్ పెట్టి.. త్వరలోనే కేసీఆర్ తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తారన్న గుసగుసలు కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.