ఇప్పటి ట్రెండ్ మల్టీ కెమెరా స్మార్ట్ ఫోన్లు
స్మార్ట్ ఫోన్ల డిజైన్, ఫీచర్ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు పెద్ద స్క్రీన్ ,అధిక సామర్ధ్యం ఉన్న బ్యాటరీ ,ర్యామ్ ఉంటే చాలు కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా కస్టమర్ల ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్–అప్, మల్టీ కెమెరా స్మార్ట్ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు నిమగ్నమవడం ఇక్కడ గమనార్హం.
ఇటీవలే అయిదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్వ్యూ ఫోన్ను తీసుకొచ్చింది. 64 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్మనిపించనున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్ తయారీ దిగ్గజం జాయిస్ సీఈవో మైఖేల్ కాష్కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కంపెనీల దొరణిలో మార్పు వచ్చింది. స్క్రీన్కు ఆనుకుని చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్, మెటల్తో కూడిన బెజెల్ తగ్గుతూ వచ్చింది. బెజెల్ లెస్ మోడళ్ల రాకతో డిస్ప్లే సైజు పెరిగింది. దీనితో బెజెల్ లేకుండా పూర్తి డిస్ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్–అప్ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ జూమ్, ఫాస్ట్ ఆటో ఫోకస్, వైడ్ యాంగిల్ వంటి ఫీచర్లతో ఇవి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక వెనుకవైపు రెండింటితో మొదలై అయిదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్ను అర్థం చేసుకోవచ్చు.
పాప్–అప్ కెమెరా మోడల్ ఇప్పుడు రూ.18 వేలకూ లభిస్తున్నాయి. వివిధ కంపెనీల నుంచి క్వాడ్, ట్రిపుల్ కెమెరా మోడళ్లు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. 48 ఎంపీతో కూడిన డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్ పాప్–అప్ కెమెరాతో సామ్సంగ్ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షావొమీ, రియల్మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి. ర్యామ్ సామర్థ్యం 12 జీబీకి, ఇంటర్నల్ మెమరీ 256 జీబీ వరకు చేరింది. బ్యాటరీ పవర్ 5,000 ఎంఏహెచ్ దాటింది. 4కే (యూహెచ్డీ) స్క్రీన్, డెకాకోర్ ప్రాసెసర్, వైర్లెస్ చార్జింగ్ మోడళ్లూ వచ్చి చేరాయి. ఇన్ని మార్పులు వచ్చినప్పటికి వినియోగదార్ల ప్రాధాన్యత మాత్రం కెమెరాకేనని ‘బిగ్ సి’ మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి అన్నారు. దేశంలో 2019లో 15–16 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా.