16న పెట్రోల్ బంకులు బంద్!
ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలు ఏరోజుకారోజు మారనున్నాయి. ఈ నిర్ణయంపై పెట్రోల్ బంకు డీలర్లు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ఈ విధానంలో డీలర్లు నష్టపోయే అవకాశాలే ఎక్కువని వారంటున్నారు. ఇంధన సంస్థల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఈనెల 16న పెట్రోల్, డీజిల్ కొనుగోలు, విక్రయాలను నిలిపివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ (ఎఫ్ఏఐపీటీ) హెచ్చరించింది.
ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు (హెచ్పీసీఎల్) దేశవ్యాప్తంగా 54,000 పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నాయి. ఇందులో మెజారిటీ బంకుల డీలర్లు ఎఫ్ఏఐపీటీలో సభ్యులుగా ఉన్నారు. దేశంలోని 50 శాతం బంకులు నెలకు సరాసరిగా 30 కిలోలీటర్ల (30వేల లీటర్లు) ఇంధనం విక్రయిస్తాయని ఎఫ్ఏఐపీటీ అంటున్నది. 18 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లారీ ట్యాంకర్ను కొనుగోలు చేస్తే చిన్న డీలర్లకు 7-10 రోజులు సరిపోతుంది. ఆ పదిరోజుల్లో ఇంధన ధరలు క్రమంగా తగ్గుకుంటూ వస్తే డీలర్ నిర్వహణ మూలధనం పూర్తిగా హరించుకుపోతుంది అని అసోసియేషన్ అంటున్నది. కొన్ని పెట్రోల్ బంకులకు ఇంధన ట్యాంకర్ చేరుకునేందుకు 2-3 రోజులు పడుతుందని, అప్పటిలోగా ధరలు గణనీయంగా తగ్గితే డీలర్ బాగా నష్టపోవాల్సి వస్తుందని ఎఫ్ఏఐపీటీ అంటున్నది.