జయ వ్యతిరేకించిన ప్రాజెక్టుకు.. పన్నీర్ సెల్వం గ్రీన్ సిగ్నల్..
చెన్నై: దివంగత తమిళ సీఎం జయలలిత అస్తమయం తర్వాత అన్నాడీఎంకె రాజకీయాల పైనే అందరి చూపు నిలిచింది. పార్టీ పగ్గాల కోసం శశికళ ప్రయత్నాలు ఓవైపు.. శశికళ నీడన పన్నీర్ సెల్వం పనితీరు ఎలా ఉండబోతున్న సందేహాలు మరోవైపు.. మొత్తంగా తమిళ రాజకీయాలు ప్రస్తుతం దేశంలోనే హాట్ టాపిక్ గా మారాయి. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఓ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. జయ సీఎంగా ఉన్న సమయంలో వ్యతిరేకించిన మధురవాయల్- చెన్నై పోర్టు ఫ్లైఓవర్ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జయలలిత మృతి తర్వాత తొలిసారిగా సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కాగా, గతంలో జయలలిత ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఫ్లైఓవర్ పనుల పునరుద్ధరణతో పాటు మెరీనాబీచ్లో జయలలిత ఘాట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.