ఘాజీ తరహాలోనే రానా హాలీవుడ్ ప్రాజెక్ట్
బాహుబలి సినిమాలో భళ్ళాలదేవుడి పాత్రలో కనిపించి తన నట విశ్వరూపాన్ని చూపించిన రానా రీసెంట్గా నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై నెం 1 యారీ కార్యక్రమానికి హోస్ట్గా అలరిస్తున్న రానా త్వరలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. లండన్ డిజిటల్ మూవీ మరియు టీవి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో రానా శాస్త్రవేత్తగా నటించనున్నారట. ఇది ఓ పెద్ద ఓడ నేపథ్యంలో సాగె కథ కాగా, 1888 నవంబర్ లో దాదాపు 700 మంది ప్రయాణికులతో బయలు దేరిన విజిల్ అనే నౌక కనిపించకుండా పోయింది. రానా ఆ నౌకను కనుగొనేందుకు సహకరించే శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. ద్వానిల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజిల్ : మిస్టరీ ఆఫ్ ది ఫాంటమ్ షిప్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం కూడా ఘాజీ తరహా చిత్రం కావడంతో ఫ్యాన్స్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2018లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. మరి ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో అలరించిన రానా హాలీవుడ్ సినిమాతో ఇంక ఏ రేంజ్ వినోదాన్ని అందిస్తాడో చూడాలి.