పెళ్ళికి రెండేళ్ళు ఆగమన్నందుకు…!
మైనార్టీ తీరకపోవడంతో ప్రేమించినవాడితో పెళ్లి చేయడం లేదన్న కారణంగా ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లోని ఫలక్ నుమా పోలీస్స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాలిక(16) స్థానిక పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. కొంత కాలంగా ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇటీవల ఆ యువకుడితో తన పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరింది. దానికి వారు నీకు మైనార్టీ తీరాలంటే ఇంకా రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఆగు అని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల సమాచారంతో ఫలక్నుమా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలిక రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని అడిగితే రెండేళ్లు ఆగాలంటున్నారు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో. మనసుకు నచ్చిన వాడిని పొందలేనప్పుడు చావే శరణ్యమనుకుంటున్నా.. మమ్మీ డాడీ సారీ’ అంటూ లేఖలో రాసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.