‘దిశ’ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది
‘దిశ’ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లుకు సంబంధించిన పూర్వాపరాలను సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులున్నాయని, దారుణ ఘటనలు నివారించాలంటే విప్లవాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో దిశ ఘటన దేశం మొత్తాన్ని కలిచివేసిందని ఆయన చెప్పారు. సినిమాల్లో అత్యాచారం చేసినవారిని తుపాకీతో కాల్చి చంపితే చప్పట్లు కొడతామని, తెలంగాణలో అదే పనిచేసిన పోలీసులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.. తెలంగాణలో ఎన్కౌంటర్ తర్వాత ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టు విచారణలు మొదలయ్యాయని, హత్యాచారం తప్పు అయినా ఎన్కౌంటర్ చేసిన పోలీసులది తప్పు అని మాట్లాడటమేంటన్నారు. అదే జరిగితే శిక్షించడానికి పోలీసులు, ప్రభుత్వాలు ముందుకు రావన్నారు.. అప్పుడు దేశంలో హత్యాచారాలు పెరిగి అరాచకాలు పెచ్చరిల్లుతాయని జగన్ చెప్పుకొచ్చారు. మనిషి రాక్షసత్వానికి పాల్పడితే త్వరగా న్యాయం కావాలని కోరుకుంటాం. నిర్భయ చట్టం వచ్చి ఏడేళ్లయినా హత్యాచార నిందితులకు ఉరిశిక్ష పడలేదు. చట్టాల్లో మార్పు వస్తేనే ప్రభుత్వాలను ప్రజలను నమ్ముతారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించడానికి దిశ బిల్లు తీసుకొచ్చాం. 13 జిల్లాల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. హత్యాచార ఘటనల్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడితే మరణశిక్షలు తప్పవు. 7రోజుల్లో దర్యాప్తు, 21రోజుల్లోనే విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడితే జీవిత ఖైదు తప్పదు’’ అని జగన్ హెచ్చరించారు. హెచ్చరికలు