ఆస్ట్రేలియా బాలుడిపై.. సముద్రపు పురుగుల దాడి
రాత్రిపూట సముద్రంలోకి దిగిన ఓ ఆస్ట్రేలియా బాలుడిపై చిన్నచిన్న నీటి పురుగులు దాడిచేశాయి. దీంతో అతడి కాళ్ల నుంచి విపరీతంగా రక్తస్రావమైంది. 16ఏళ్ల సామ్ కనీజే గత శనివారం రాత్రి మెల్బోర్న్లోని బ్రింగ్టన్ తీరానికి వెళ్లాడు. నడుము లోతు వరకూ నీళ్లలోకి దిగి సరదాగా 30 నిమిషాలు గడిపాడు. అనంతరం బయటకు వస్తున్నప్పుడు అతడి పాదాలు, చీలమండ నుంచి రక్తం విపరీతంగా కారడం గమనించాడు. నీళ్లు మరీ చల్లగా ఉండటంతో కాళ్లకు తిమ్మిరి పట్టినట్లు అనిపించింది. చిన్నచిన్న సూదులు గుచ్చిన భావనా కలిగింది అని సామ్ చెప్పాడు. త్వరగా రక్తాన్ని మంచి నీళ్లతో కడుక్కున్నాను. దీంతో పాదాలు, చీలమండపై వందల కొద్దీ చిన్నచిన్న రంధ్రాలు కనిపించాయి. ఎన్నిసార్లు కాళ్లు శుభ్రం చేసుకున్నా.. రక్తస్రావం ఆగలేదు అని వివరించాడు. యుద్ధంలో గాయపడినట్లు రక్తంతో మా అబ్బాయి ఇంటికి వచ్చాడు.
వెంటనే దగ్గర్లోని రెండు ఆసుపత్రులకు అతణ్ని తీసుకెళ్లాను. అయితే ఏం జరిగిందో వైద్యులు చెప్పలేకపోయారు. దీంతో కారణాలను అన్వేషిస్తూ సముద్రానికి వెళ్లాను. అక్కడ పేలు లాంటి వేలకొద్దీ వింత పురుగులు కనిపించాయి. జాగ్రత్తగా నీళ్లలోకి దిగి ఓ వల సాయంతో కొన్నింటిని పట్టుకున్నాను. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వాటిని పరిశోధకులకు పంపించాను్ణఅని సామ్ తండ్రి జారోడ్ కనీజే తెలిపారు. ప్రస్తుతం సామ్ కోలుకుంటున్నాడని, త్వరలో ఇంటికి వచ్చేస్తాడని వివరించారు. ఇసుక రంగులో కనిపించే ఆ పురుగులు ఏం చేస్తాయో? అసలు అవి ఎందుకు కరిచాయో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాఅని ఆయన పేర్కొన్నారు. ఈ పురుగులను పరిశీలించిన సముద్రపు జీవుల పరిశోధకుడు జెనీఫర్ వాకెర్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ఇవి సముద్రంలోని వృక్ష, జంతు సంబంధిత పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో తోడ్పడతాయి. పిరానా చేపల్లా ఇవి మనపై దాడిచేసేందుకు ఎదురుచూడవు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని ఆయన వివరించారు.