భారతీయులతో పవన్ ప్రసంగం దుమ్మురేపింది

పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అమెరికా వేదికపై తన తొలి ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అయిదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నషువా నగరంలోని రివర్ యూనివర్శిటీ వద్ద అభిమానులు నిర్వహించిన కార్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం భారతీయ సంతతి వారు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. న్యూజెర్సీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడైన ప్రవాసాంధ్రుడు ఉపేంద్ర చివుకుల లత మంగిపూడి నషువా మేయరుతోపాటు డెమొక్రటిక్ రిపబ్లికన్ పార్టీలకు చెందిన అమెరికన్ సెనేటర్లు అభిమానులనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించిన పవన్ చివర్లో అభిమానుల కోరిక మేరకు కొద్దిసేపు తెలుగులోనూ మాట్లాడారు.  జనసేన పార్టీ స్థాపన ఉద్దేశం తమ పార్టీ భావజాలం భారతీయ రాజకీయ వ్యవస్థ తీరు తెన్నులపై ఆయన తన భావాలను అక్కడి వారితో పంచుకున్నారు. సుమారు గంటసేపు ఆయన ప్రసంగం ఇలా సాగింది. ” నేను పెద్దగా చదువుకోలేదు. డ్రాపవుట్ ను కూడా. కానీ జీవితాన్ని సమాజాన్ని చదవడంలో నేను నిత్య విద్యార్థినే. చిన్నప్పటి నుంచీ సమాజం తీరు తెన్నులనే గమనించేవాడిని. అనుకోకుండా నటుడినయ్యాను.

మీ ఆదరణతో విజయవంతంగా నిలిచాను. నా వరకు నాకు బాగానే ఉంది. కానీ సమాజ పరిస్థితులు చూసి… సౌకర్యంగా ఉండలేకపోయాను. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలిగినప్పుడే నాకు రిలీఫ్ లభించినట్లు భావిస్తాను. నా ప్రతిష్ఠకు కారణమైన ఈ సమాజానికి మేలు చేయాలన్న తలంపుతోనే ‘జనసేన’ను స్థాపించాం. జనసేన వద్ద తుపాకులుండవు. గుండె ధైర్యమే మా ఆయుధం. ఏం పోయినా లెక్క చేయను. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోను. ధైర్యే సాహసే లక్ష్మీ…ధైర్యం ఉంటే అన్నీ వస్తాయి. ఎన్నో వేలమంది మహానుభావుల నిస్వార్థ పోరాటం బలిదానాల వల్ల మనం ఈరోజు స్వాతంత్ర్యం తాలూకు స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. వారందరికీ మనం రుణపడి ఉంటాం. జాతీయ సమగ్రత మన లక్ష్యం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకత. భౌగోళికంగా సరిహద్దులుండవచ్చేమో కానీ భారతీయులంతా ఒక్కటే అనే భావన గొప్పది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవు. సమాజాన్ని విభజించేవిగా మారిపోతున్నాయి. ప్రజలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను ఆదిలోనే పరిష్కరించకపోతే అవి విపత్తులా మారిపోతాయి. మన దేశ రాజకీయ నాయకులు దీన్ని గుర్తించడంలేదు. సమస్య పెద్దగా మారిపోయాక కూడా స్పందించడంలేదు. తెలంగాణ సమస్యే దీనికి నిదర్శనం. 30 ఏళ్లకు పైగా ఈ సమస్యను పట్టించుకోని స్థితిలో ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది” అని పవన్ విశ్లేషించారు.

ఈ సందర్భంగా రాజకీయాల గురించి వపన్ తనదైన శైలిలో విశ్లేషించారు. “గాంధీని అంబేడ్కర్ ను గౌరవిస్తున్నాం. కానీ వారి మార్గాన్ని అనుసరిస్తున్నామా? ఆచరణ లేని మాటలు వృథా. గతంలో చాలా మంది పేదలు తమ సమస్యలు తీర్చమంటూ నా వద్దకు వచ్చేవారు. చదువులకనో… వైద్యానికనో సాయం అడిగేవారు. నాకు తోచిన తోడ్పాటు అందించేవాడిని. కానీ వ్యక్తిగతంగా నేను అలాంటి కొంతమందికే సాయం చేయగలను. గతంలో నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పడు నాకు చాలా బెదిరింపులు వచ్చాయి. చంపుతామంటూ లేఖలు కూడా వచ్చాయి. కానీ అలాంటి వాటికి నేను భయపడను. అలా భయపడేవాడినైతే రాజకీయాల్లోకి ఎందుకొస్తాను? చాలా కాలం నాకు నేను పరీక్షలు పెట్టుకున్నాకే…ఇక్కడ దెబ్బతిన్నా తట్టుకోగలనన్న నమ్మకంగా కలిగాకే రాజకీయాల్లోకి అడుగు పెట్టా. దెబ్బతిని నిలబడగలగడమూ తెలుసు. దెబ్బ కొట్టడమూ తెలుసు. నాకు వ్యక్తిగతంగా  ఎవరిపైనా కోపం లేదు.

రాజకీయ నాయకుల అపసవ్య ధోరణిపైనే నా అసహనం. నా దృష్టిలో రాజకీయం కుళ్లు అంటారు కొందరు. కానీ నా దృష్టిలో అది పవిత్ర వృత్తి. మన రాజ్యాంగం చాలా గొప్పది. దాన్ని గొప్ప ఉద్దేశాలతో రచించారు. కానీ అనుసరణలోనే లోపాలున్నాయి. జాగ్రత్త ఉంది… కానీ భయం లేదు. నిజజీవితంలో సవాళ్లను ఎదుర్కోవడమే నాకు ఇష్టం. నాకు జాగ్రత్త ఉంది. కానీ భయం లేదు. ఆచితూచి మాట్లాడతా. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. కానీ దేనికీ వెరచేది లేదు.పాలకులు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఎంత వరకైనా పోరాడుతా. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమే తీసుకుంటే… ఎన్నికల ముందు ప్రజలకు అర్థమయ్యే భాషలో- మీకు అది చేస్తాం… ఇది చేస్తాం…. అంటూ హామీలిచ్చిన వారు అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించమంటే- అంకెలు గణాంకాలు చెబుతారేంటి? సామాన్యులకు అర్థం కాని ఈ అంకెలు చెబుతున్నారంటే వారు అబద్ధమాడుతున్నారనే అనుకోవాలి” అని వివరించారు.

సొంత డబ్బుతోనే పార్టీ నడుపుతున్నానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వివరించారు. “అధికారమే జనసేన అంతిమ లక్ష్యం కాదు. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యం. అధికారంతోనే అన్నీ పరిష్కారం కావు. పోరాడాలి. అందుకోసం మనకు బలమైన భావజాలం ఉండాలి. అభిమానులు యువత  నుంచి జనసేనకు మంచి ఆలోచనలు కావాలి. బలమైన యువ నాయకత్వం కావాలి. రాజకీయ నాయకుల పిల్లలేనా యువతంటే? మీరు కాదా? ఈ విధానం మారాలి. మా పార్టీని విస్తరించాలంటే నిబద్ధత ఉన్న వారు కావాలి. చాలా మంది పార్టీకి విరాళాలిస్తామంటూ వస్తారు. కానీ దాన్ని నేను బరువుగా భావిస్తా. ప్రస్తుతం సొంత డబ్బుతోనే నడిపిస్తున్నా. పార్టీకి విరాళాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే… పారదర్శకంగా ప్రజలందరికీ తెలిసేలా తీసుకుంటా. అలాగే వినియోగిస్తా” అని ప్రకటించారు. ఓపికున్నంత వరకు సినిమాల్లో నటిస్తానని పవన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సినిమాల్లో నటించడం ఆపవద్దు అంటూ అభిమానులు గోల చేయడంతో కేవలం ఏడు సినిమాలు చేసి మానేద్దామనుకున్నానని పవన్ ప్రకటించారు. “జానీ సినిమా హిట్ అయితే మానేసేవాడినేమో. నాకు సినిమా అంటే ప్రేమ ఉంది. డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు డబ్బు అవసరమే కానీ దానిపై మమకారం లేదు. సినిమాల్లో నటించడం ఇష్టమే. కానీ ఒకోసారి బాధ్యతల వల్ల కొన్నాళ్ల విరామం రావచ్చు కానీ వీలైనంతవరకు ఓపికున్నంత వరకు నటిస్తా” అని ప్రకటించారు.

పవన్ తన ప్రసంగంలో అమెరికన్ ప్రముఖులైన థామస్ అల్వా ఎడిసన్ మార్టిన్ లూధర్ కింగ్ జాన్ కెన్నెడీ జార్జి వాషింగ్టన్ తదితరుల గొప్పదనాన్ని స్మరించుకున్నారు. మా దేశానికి వచ్చి అభివృద్ధికి సలహాలివ్వండంటూ నషువా మేయరును ఆహ్వానించారు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ధరించిన ఎర్ర రుమాలును ఒక అభిమాని బహూకరించగా ఆయన దాన్ని వేదికపైనే ధరించారు. ఈ రుమాలు శ్రామికుడికి సామాన్యుడికి భారతీయుడికి గుర్తు అని కుల మత భేదాలు లేకుండా భారత దేశంలో దీన్ని చాలా మంది ధరిస్తారని చెప్పారు. చివరిగా రాయప్రోలు సుబ్బారావు గేయంలోని ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అనే పంక్తులను ఉదహరించారు. ‘భారత్ మాతా కీ జై…జైహింద్’ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *